పరీక్షిన్మహారాజు పలికెను-మహాత్మా! దేవగురువైన బృహస్పతి తన ప్రియ శిష్యులైన దేవతలను పరిత్యజించుటకు కారణమేమి? దేవతలు ఆయనయెడ చేసిన అపచారమేమి? దయతో తెలుపుము.
శ్రీశుక ఉవాచ
శ్రీ శుకుడు నుడివెను- ఇంద్రుడు ముల్లోకముల ఐశ్వర్యములను పొందుటచే గర్వితుడయ్యెను. అందువలన ధర్మమర్యాదలను, సదాచారములను ఉల్లంఘింపసాగెను. ఒకానొకనాడు అతడు తనపత్నియైన శచీదేవితో గూడి నిండుసభలో సింహాసనముపై ఆసీనుడైయుండెను. నలుబది తొమ్మిది మంది మరుద్గణములు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశ-ఆదిత్యులు, ఋభుగణములు, విశ్వేదేవతలు, సాధ్యులు, అశ్వినీకుమారులు అతనిని సేవించు చుండిరి. సిద్ధులు, చారణులు, గంధర్వులు, బ్రహ్మవాదులైన మునులు, విద్యాధరులు, అప్సరసలు, కిన్నరులు, పక్షిగణములు, నాగులు అతనిని సేవించుచు స్తుతించుచుండిరి.
వారు అందరును మధురమైన స్వరములతో ఇంద్రుని కీర్తించుచుండిరి. చంద్రమండలము వలె సుందరమైన శ్వేతచ్ఛత్రము శోభిల్లుచుండెను. వింజామరలు, వీవనలు మొదలగు మహారాజోచితమైన మర్యాదలు నిర్వహింపబడు చుండెను.
ఆ సమయమున దేవేంద్రాదిదేవతలకు పరమగురువైన బృహస్పతి అచటికి ఏతెంచెను. అతనికి సురాసురులందరునూ నమస్కరింతురు. అయితే, సురాసురులందరకును పూజ్యుడైన బృహస్పతి సభలో ప్రవేశించుటను ఇంద్రుడు చూచెను. ఐనను, అతడు సింహాసనము నుండి లేచుట గాని, గురువును సత్కరించుటగాని చేయక అటుఇటు కదలకుండా కూర్చొనియుండెను.
త్రికాలదర్శి, సమర్థుడు ఐన బృహస్పతి, ఇదీ ఐశ్వర్యమద దోషము అని భావించి, వెంటనే అతడు అచటి నుండి మౌనముగా వెను దిరిగి, తన ఇంటికి చేరెను.
అంతట ఇంద్రుడు తనవలన బృహస్పతికి అవమానము జరిగినదను విషయమును గ్రహించెను. అప్పుడు నిండు సభలో తనను తాను నిందించుకొనసాగెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
బృహస్పతికి నిండుసభలో జరిగిన అవమానమునకు దేవేంద్రుడు తనను తానిట్లు నిందించుకొనసాగెను:
అయ్యో! నేడు ఈ నిండుసభలో నేను ఎంతటి అపరాధమొనర్చితిని? ఐశ్వర్యభమదోన్మత్తుడనై మూర్ఖముగ ప్రవర్తించి గురువునెడ తీరని అపరాధమొనర్చితిని. వాస్తవముగా నేను ఇట్లు వ్యవహరించుట మిగుల గర్హణీయము.
దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-
బుద్ధిమంతుడైన వాడెవడు ఈ స్వర్గరాజ్య సంపదలను పొందుటకు ఇష్టపడడు. చూడుడు! నేడు ఈ సంపదయే దేవతలకు ప్రభువైన నన్ను గూడ అనుచరులవలె రజోగుణ భావమునకు గురిచేసినది.
దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనసాగెను:
'సార్వభౌమ అధికారముతో రాజ్యసభ సింహాసనముపై కూర్చున్న చక్రవర్తి ఎవరు వచ్చిననూ సింహాసనమునుండి లేవగూడదు' అని కొందరు చెప్ఫెదరు. వారు వాస్తవముగా ధర్మస్వరూపమును ఎరుగనివారే.
॥5033॥
దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-
ఏలయన, ఇట్లు ఉపదేశించువారు జనులను చెడు మార్గములలో తీసికొనిపోవుదురు. అట్టివారు స్వయముగా ఘోర నరకమున పడుదురు. వారి పలుకులను విశ్వసించినవారు రాతిపడవవలె నీటిలో మునిగిపోవుదురు.
దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-
నా గురువైన బృహస్పతి అగాధమైన జ్ఞానసముద్రుడు. అట్టి వానియెడ నేను గొప్ప అపరాధమొనర్చితిని. ఇప్పుడు నేను ఆ మహాత్ముని పాదములపై వ్రాలి ఆయనను ప్రసన్నుని చేసికొనుటయే నా కర్తవ్యము".
అని దేవేంద్రుడు ఈ విధముగా అనుకొనుచుండగనే మహాత్ముడైన బృహస్పతి తన ఇంటినుండి వెడలి యోగబలముచే అంతర్హితుడయ్యెను.
దేవేంద్రుడు తన గురువును తాను స్వయముగ వెదకుటయేగాక, ఇతరులచే వెదకించెను. కాని, ఆయన ఆ చూకీ దొరకలేదు. గురువులేకుండా తనకు రక్షణ యుండదని ఇంద్రుడు భావించెను. అంతట ఇతర దేవతలతో గూడి స్వర్గ రక్షణకై తగిన ఉపాయము కొరకై ఆలోచించెను. కాని, వారి నుండి ఎట్టి ఉపాయము లభింపకుండుటచే అతడు అశాంతికి గురియయ్యెను.
దేవగురువైన బృహస్పతి దేవతలను వదలివెళ్ళిన సమాచారము దైత్యులకు తెలిసెను. అప్ఫుడు మదోన్మత్తులు, ఆతతాయులు ఐన దైత్యులు శుక్రాచార్యుని ఆదేశానుసారము దేవతలను జయించుటకు ఉద్యమించిరి.
ఆ దైత్యులు దేవతలపై తీవ్రమైన బాణములను వర్షింపజేసి, వారి మస్తకములు, ఊరువులు, బాహువులు మొదలగు అంగములను భేదింపసాగిరి. అప్పుడు ఇంద్రాదిదేవతలు వినమ్రులై బ్రహ్మదేవుని శరశుజొచ్చిరి.
సర్వసమర్థుడు, స్వయంభువు ఐన బ్రహ్మదేవుడు వాస్తవముగ దేవతలకు దుర్దశ ఏర్పడినదని గ్రహించెను. అందుకు అతని హృదయము దయార్ద్రమయ్యెను. అంతట దేవతలకు ధైర్యము గొలుపుటకై అతడు ఇట్లు పలికెను.
బ్రహ్మదేవుడు ఇట్లనెను- దేవతలారా! వాస్తవముగా మీరు గొప్ప తప్పుపని చేసితిరి. ఐశ్వర్యమదముచే కన్ను మిన్ను గానక బ్రహ్మజ్ఞాని జితేంద్రియుడు ఐన బ్రాహ్మణశ్రేష్ఠుని నిరాదరించితిరి. ఇది మిగుల శోచనీయము. మీరొనర్చిన అపరాధమునకు ఇది ఫలితము. మీరు సంపదలతో తులతూగుచున్నను దుర్భలులైన శత్రువులచే పరాభవమును ఎదుర్కొనవలసి వచ్చినది.
ఇంద్రా! చూడుము. నీ శత్రువులు గూడ మొదట తమకు గురువైన శుక్రాచార్యుని అవమాన పరచినందులకు మిక్కిలి బలహీనులైరి. కాని భక్తి భక్తిభావముతో అతనిని ఆరాధించి ధనముతోను, బలముతోను తులతూగిరి. శుక్రుని తమ ఆరాధ్యదైవముగా భావించునట్టి ఈ దైత్యులు కొలది దినములలో నా బ్రహ్మలోకములను గూడ ఆక్రమించెదరని నాకు తోచుచున్నది. భృగువంశీయులు వీరికి అర్థశాస్త్రమునందు పూర్తిగ శిక్షణను ఇచ్చినది. వారి పన్నాగములను త్రిప్పికొట్టు మార్గములు మీకు గూడ తెలియవు. అవి చాల గుప్తముగా ఉండును. ఇట్టి స్థితిలో స్వర్గమునే గాదు, వారు ఏ లోకమునైనను జయింపగలరు. బ్రాహ్మణులను, గోవిందుని, గోవులను తమ సర్వస్వముగా భావించెడు రాజులకు ఎన్నిటికినీ, అశుభము కలుగదు.
కనుక, ఇప్పుడు మీరు వెంటనే త్వష్టపుత్రుడైన విశ్వరూపునికడకేగి, ఆయనను సేవింపుడు. అతడు విప్రోత్తముడు, తపస్సంపన్నుడు, జితేంద్రియుడు. కాని, అతని తల్లి అసురకులమునకు చెందినది. కనుక, మీరు అసురులను ప్రేమతో క్షమింఛి, అతనిని గౌరవించినచో, అతడు మీకార్యమును నెరవేర్చగలడు.
శ్రీ శుక ఉవాచ
శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహాజా! బ్రహ్మదేవుడు ఈ విధముగ సూచించిన పిమ్మట దేవతలకు చింతతొలగి ధైర్యము వచ్చెను. వెంటనే వారు విశ్వరూపమహర్షి కడకేగి, ఆయనను అక్కున జేర్చుకొని ఇట్లు నుడివిరి.
దేవా ఊచుః
దేవతలు ఇట్లనిరి- నాయనా! విశ్వరూపా! నీకు శుభమగుగాక! మేము నీ ఆశ్రమమునకు అతిథులమై వచ్చితిమి. ఒక విధముగా మేము నీకు పితృతుల్యులము. కనుక సమయోచితమైన మా అభిలాషను నెరవేర్చుము.
బ్రాహ్మణోత్తమా! సంతానవంతులైన సత్పుత్రులు తమ తల్లిదండ్రులసు, ఇతర గురుజనులను సేవించుటయే పరమధర్మమని భావింతురు. ఇక బ్రహ్మచారిగా ఉన్న నీ విషయము చెప్పనేల?
గురువు వేదస్వరూపుడు. తండ్రి బ్రహ్మదేవుని వంటివాడు. సోదరుడు ఇంద్రునితో సమానము. ఇంక తల్లి సాక్షాత్తు భూదేవి స్వరూపము. చెల్లెలు దయామూర్తి. అతిథి, సాక్షాత్తు ధర్మమూర్తియే. అభ్యాగతుడు అగ్నితో సమానుడు. జగత్తునందలి సకల ప్రాణులు ఆత్మ స్వరూపులే.నాయనా! విశ్వరూపా! మేము నీకు పితృసమానులము. ఇప్పుడు శత్రువులు మమ్ము జయించిరి. మేము ఆపదలపాలైయున్నాము నీవు నీ తపోబలముతో మా దుఃఖమును, దారిద్ర్యమును, పరాజయమును పారద్రోలుము. మా అభిప్రాయమును ఆలకించి, మాకు మేలు చేయుము.
నీవు బ్రహ్మనిష్ఠాపరుడవైన (వేదధర్మజ్ఞుడవైన) విప్రవరుడవు. కావున, జన్మతః మాకు గురుడవు. నిన్ను మేము మా ఆచార్యునిగా ఎన్నుకొనుచున్నాము. నీ తపోబలముతో మేము సులభముగ మా శత్రువులపై విజయమును సాధింపగలము.
మహాత్మా! సందర్భమును బట్టి తమకంటెను చిన్నవారిపదములకు నమస్కరించుట తప్పుగాదని విజ్ఞులందురు. పెద్దరికము వయస్సునుబట్టిగాక వేదజ్ఞానముబట్టి నిర్ణయింపవలెను. కావున, వయస్సునుబట్టి పెద్దరికము లభింపదు. నీవు వేదజ్ఞానసంపన్నుడవు ఐనందున, మా అందరికి నీవు పెద్దవాడవు ఐతివి.
ఋషిరువాచ
శ్రీశుకుడు వచించెను- మహారాజా! దేవతలు ఈ విధముగా విశ్వరూపుని తమకు పురోహితునిగా ఉండుమని ప్రార్థించిరి. అప్పుడు పరమతపస్వియైన విశ్వరూపుడు ప్రసన్నుడై వారితో ప్రియముగా, మధురముగా ఇట్లనెను-
విశ్వరూప ఉవాచ
విశ్వరూపుడు పలికెను "పెద్దలారా! పౌరోహిత్యము బ్రహ్మతేజస్సును క్షీణింప జేయును. కనుక, అది గర్హింపదగినది అని ధర్మజ్ఞులు నుడువుదురు. కాని, మీరు నాకు పితృతుల్యులు, లోకపాలురు. ఐనను, మీరు నన్ను పురోహితునిగా ఉండుమని వేడుకొనుచున్నారు. ఇట్టి స్థితిలో నా వంటి వాడు మీ కోరికను ఎట్లు తిరస్కరింపగలడు? నేను మీ సేవకుడను. మీ ఆజ్ఞను పాటించుటయే నా ధర్మము.
దేవతలారా! మేము అకించనులము. పొలములో పైర్లు కోసిన పిదప రాలిన ధాన్యములను ఏరుకొందుము. దానితో దేవకార్యమును, పితృకార్యమును ఆచరించుచుందుము. ఆ విధముగా శిలోంఛవృత్తితో జీవితమును గడుపునట్టి నేను నింద్యమగు పౌరోహిత్యమును ఎట్లు చేయగలను? అట్టి వృత్తిచే సంతోషించువారు బుద్ధిహీనులు.
ఐనను, నేను మీ కోరికను తిరస్కరింపజాలను. మీ ప్రార్థన మిగుల స్వల్పమైనది. నా ప్రాణమును, తపోబలమును ఒడ్డియైనను మీ మనోరథమును నెరవేర్చెదను".
శ్రీ శుక ఉవాచ
శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహారాజా! మహాతపస్వియైన విశ్వరూపుడు దేవతలకు ఇట్లు ప్రతిజ్ఞ చేసి, వారిప్రార్థన మేరకు పౌరోహిత్య వృత్తిని చేపట్టెను. మిక్కిలి ఏకాగ్రతతో తన వృత్తిధర్మమును నెరవేర్చెను.
శుక్రాచార్యుడు తన నీతి బలముతో అసురుల సంపదను సురక్షితముగా భద్రపరచెను. ఐనను, సర్వసమర్థుడైన విశ్వరూపుడు తన వైష్ణవ విద్య (నారాయణ కవచ) ప్రభావముచే ఆ సంపదలను మరల గ్రహించి, దేవేంద్రునకు అప్పగించెను.
రాజా! ఉదారశీలుడైన విశ్వరూపుడు ఆ వైష్ణవి విద్యను దేవేంద్రునకు బోధించెను. తత్ప్రభావమున వేయికన్నుల వేల్పుడగు దేవేంద్రుడు అసురసైన్యములపై విజయమును సాధించెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే సప్తమోఽధ్యాయః (7)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఏడవ అధ్యాయము (7)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment