Tuesday, 14 July 2020

సంస్కృత మహాభాగవతం సప్తమ స్కంధము - పదమూడవ అధ్యాయము


సప్తమ స్కంధము - పదమూడవ అధ్యాయము
యతిధర్మముల నిరూపణము-అవధూతకును, ప్రహ్లాదునకును మధ్య జరిగిన సంవాదము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
నారదుడు నుడివెను ధర్మరాజా! వానప్రస్థమున బ్రహ్మవిచార సామర్థ్యము కలిగినచో శరీరము తప్ప మిగిలిన వాటిని అన్నింటిని త్యజించి, (శరీర మాత్రావశిష్టుడై) సన్న్యాసమును స్వీకరింపవలెను. అట్లే ఏ వ్యక్తినైనను, వస్తువునైనను, స్థానమునైనను, సమయమునైనను  అపేక్షింపక ఒక్కొక్క గ్రామము నందు ఒక రాత్రిని గడుపునియమమును పాటించుచు భూతలమున సంచరింపవలెను.
సన్న్యాసి వస్త్రమును ధరించవలసిన పక్షములో కేవలము  కౌపీనమును మాత్రమే ధరించవలెను. తనకు ఇబ్బంది కలుగునంతవరకు దండము తక్కిన ఆశ్రమ చిహ్నములను కలిగియుంఢవలెను. సన్న్యాసదీక్షను స్వీకరించినప్పుడు, తాను త్యజించిన ఏ వస్తువును గూడ మరల గ్రహింపరాదు.

సన్న్యాసి దేనిని ఆశ్రయింపక తనలో తాను ఆనందించుచు (ఆత్మారాముడై) ఒంటరిగానే సంచరింపవలెను. సకల ప్రాణులకును హితమును గోరుచు ప్రశాంతచిత్తుడై, నారాయణపరాయణుడై ఉండవలెను.

సంపూర్ణవిశ్వమును, దాని కార్యకారణములకు అతీతుడైన పరమాత్మయందే అధ్యస్తమైనట్లు ఎఱుంగవలెను. కార్యకారణరూప జగత్తునందు పరబ్రహ్మ స్వరూపమును తన ఆత్మగా దర్శింపవలెను.

ఆత్మదర్శియైన సన్న్యాసి సుషుప్తి, జాగ్రదవస్థల సంధికాలముల యందు  తన స్వరూపమునే దర్శింపవలెను. బంధమోక్షములు రెండును కేవలము మాయయనియు, వస్తుతః అవి అసత్యములనియు గ్రహింపవలెను.

శరీరమునకు మృత్యువు అనివార్యమని, జీవితము అనిశ్చితమని తెలిసికొని వాటిని అభినందింపరాదు. సకల ప్రాణుల ఉత్పత్తి, వినాశములకు కారణమైన కాలమునకై నిరీక్షించుచుండవలెను.

అసత్యములైన అనాత్మ వస్తువులను ప్రతిపాదించు శాస్త్రములయందు ఆసక్తిని కలిగియుండరాదు. జీవన నిర్వహణమునకై ఎటువంటి జీవనోపాధిని ఆధారము చేసికొని జీవింపరాదు. వాదప్రతివాదములను, తర్కములను విడిచిపెట్టవలెను. లోకమునందు ఏ పక్షమునూ వహింపరాదు.

శిష్యమండలులను ఏర్పరచరాదు. తత్త్వవిచారమునకు పెక్కు గ్రంథములను పరిశీలింపరాదు. ఉపన్యాసములను చేయరాదు. ప్రాపంచిక కార్యములను ఎన్నడును ఆరంభింపరాదు.

శాంతచిత్తుడై, సమదర్శియైన సన్న్యాసి ఏ ఆశ్రమముతోను బంధమును ఏర్పరచుకొనరాదు. తన ఆశ్రమ చిహ్నములనుగూడ ఇష్టమైతే కలిగియుండవచ్చును లేదా, విడిచిపెట్టవచ్చును.

యతి ఆత్మానుసంధానము నందే నిమగ్నుడై యుండవలెను. ఆశ్రమ చిహ్నములు ఏవియు అతని దగ్గర ఉండరాదు. అతడు ధ్యానమగ్నుడై ఇతరులకు ఒక పిచ్చివానివలె, అమాయకుడైన ఒక బాలునివలె ఉండవలెను. అతడు మిగుల ప్రతిభా శాలియైనను, సామాన్యమానవుల దృష్టిలో ఒక మూగవానివలె అగుపించవలెను.

ధర్మరాజా! ఈ విషయమున మహాత్ములు ఒక ప్రాచీన గాథను తెల్పెదరు. అది దత్తాత్రేయమునికిని ప్రహ్లాదునకును మధ్య జరిగిన సంవాదము. ఆ మహర్షి కొండచిలువవలె తన యొద్దకు వచ్చిన ఆహారమును మాత్రమే తిని (అజగర వృత్తితో) జీవించుచుండెను.

ఒకసారి భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు కొద్ది మంత్రులతో గూడి జనుల సమస్యలను గూర్చి తెలిసికొనుటకై లోకములయందు తిరుగుచుండెను. అప్పుడతడు సహ్యాద్రి సానువులయందు కావేరీనదీ తీరమున నేలపై పరుండియున్న ఒకమునిని చూచెను. ఆయన శరీరము దుమ్ముతో నిండియుండెను. అందువలన ఉజ్జ్వలమైన ఆయన తేజస్సు స్పష్టముగా గోచరింపకుండెను.

అతని కర్మలను, ఆకారమును, వాక్కును, వర్ణాశ్రమాది చిహ్నములను బట్టి అతడు సిద్ధపురుషుడా? కాదా? అను విషయము లోకులకు తెలియకుండెను.

భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు ఆయన పాదములను తాకి శిరసా ప్రణమిల్లెను. విధ్యుక్తముగా ఆయనను పూజించి, జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను-


"మహాత్మా! నీ శరీరము ధన సంపాదనము చేయు భోగపురుషుని వలె పుష్టిగా, బలిష్ఠముగా ఉన్నది. లోకములో ప్రయత్నము చేయువారికా ధనము లభించును. ధనవంతులకు భోగములు ప్రాప్తించును. అట్టి వారి శరీరములే పుష్టి గలిగియుండును. మహాత్మా! నీవు ఎట్టి పనియు చేయకుండా ఊరక శయనించియున్నావు. కనుక, నీ యొద్ద ధనము ఉండియుండును. ఇంక నీకు భోకప్రాప్తి యెట్లు గలుగును? ఐనను నీ శరీరము ఇంత పుష్టిగా, బలిష్ఠముగా ఎట్లున్నది? నేను వినుటకు అర్హుడనైనచో (గోప్యముగానిచో) తెల్పుము. మహానుభావా! నీవు విద్వాంసుడవు, సమర్థుడవు, చతురుడవు. నీ వచనములు అద్భుతమైనవి, మిక్కిలి ప్రియమైనవి. ఇట్టి స్థితిలో లోకములోని జనులందరును పనులలో నిమగ్నమై యుండుటను చూచియు, ఉపేక్షాభావముతో నీవు శయనించి యుండుటకు కారణమేమి?"

నారద ఉవాచ


నారదుడు పలికెను- ధర్మరాజా! మహామునియైన దత్తాత్రేయుని ప్రహ్లాదుడు ఇట్లు ప్రశ్నింపగా అతని అమృతమయమైన వాక్కులకు ముగ్ధుడై, ఆ ముని దరహాసముతో ఇట్లు పలికెను-

బ్రాహ్మణ ఉవాచ

దత్తాత్రేయుడు ఇట్లు పలికెను- దైత్యరాజా! నీవు అందఱిచే గౌరవింపబడుదువు. మనుష్యులు కర్మలయందు ప్రవృత్తులగుటకును, వాటినుండి నివృత్తులగుటకును, కలుగు ఫలములు, నీ జ్ఞానదృష్టికి తెలిసియే యుండును. ప్రవృత్తి - నివృత్తి మార్గముల ఫలితములు జ్ఞానియైన నీకు సువిదితమే గదా! నీ అనన్య భక్తి కారణముగా దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడు నీ హృదయమున సర్వదా విరాజిల్లుచుండును. సూర్యుడు అంధకారమును వలె ఆ ప్రభువు నీ అజ్ఞానమును పారద్రోలుచుండును. నీవు సర్వజ్ఞుడవు. ఐనను, నాకు తెలిసినంతవరకు నీ ప్రశ్నలకు సమాధానమును తెల్పెదను. ఏలయన, ఆత్మశుద్ధిని కోరుకొనువారు నిన్ను తప్పక గౌరవింపవలెను. ప్రహ్లాదా! ఇష్టానుసారము భోగములు ప్రాప్తించినను తృష్ణ ఎన్నటికిని తీరదు. దానివలన జనన మరణ చక్రములో పరిభ్రమింపవలసియుండును. ఈ తృష్ణ నాతో ఎన్ని కర్మలను చేయించినచో, ఫలితముగా నేను ఎన్ని జన్మలను ఎత్తితినో నాకు తెలియదు. నేను చేసిన కర్మల కారణముగా నేను పెక్కు జన్మలలో తిరుగాడుచు, అదృష్టవశమున ఈ మనుష్యజన్మను పొందితిని. ఇది స్వర్గమోక్షములకును, పశుపక్ష్యాదులకును మరల మానవదేహప్రాప్తికి ద్వారము. ఈ మానవ జన్మయందు పుణ్యము చేసినచో స్వర్గమును, పాపకర్మలను ఆచరించియున్నచో, పశుపక్ష్యాది జన్మలను జీవులు పొందుదురు. నివృత్తి మార్గమున మోక్షము, పుణ్యపాప కర్మల వలన మనుష్య జన్మయును ప్రాప్తింపవచ్చును. ఈ లోకమున స్త్రీలు, పురుషులు దుఃఖములనుండి బయట పడి సుఖములను పొందుటకు కర్మలను చేయుచుందురు. కాని ఫలితము దానికి విపరీతముగా ఉండును. ఇంకను వారు దుఃఖముల పాలగుచుందురు. ఈ విషయమును గమనించియే నేను కర్మలనుండి నివృత్తుడనైతిని.
సహజమైన ఆనంద స్వరూపమైనది ఆత్మ. సకల చేష్టలనుండి నివృత్తమైనప్పుడే ఆత్మానందము యొక్క అనుభూతి కలుగును. సమస్తభోగములు మనస్సు చేత కల్పింపబడినవి. కావున, అవన్నియు మిథ్య అని గ్రహించి నేను నాా ప్రారబ్ధమును అనుభవించుచు హాయిగా శయనించి యున్నాను.

మానవుడు వాస్తవముగా ఆత్మయే సుఖస్థానమను మాటను మరచిపోయి, మిథ్యయగు ద్వైతమునే సత్యమని భావించి, మిగుల భయంకరమైన జనన మరణ చక్రములో పరిభ్రమించుచుండును.

అజ్ఞాని గడ్డి, నాచు మొదలగు వాటితో కప్పబడిన జలముల అడుగు భాగమునందు నిర్మలమైన జలములు ఉన్న విషయమును గ్రహింపక, జలముల కొరకై ఎండమావులవైపు పరుగెత్తుచుండును. అట్లే, మానవుడు తన ఆత్మయే సుఖస్వరూపమను విషయమును తెలిసికొనక నానాత్వముతో గూడిన  విషయ భోగములవైపు పరుగెత్తుచుండును.

ప్రహ్లాదా! శరీరాదులు ప్రారబ్ధమునకు అధీనములు. వాటి ద్వారా దుఃఖములను తొలగించుకొని, సుఖములను పొందుటకు ఆరాటపడువారు, తమ ప్రయత్నములో ఎన్నడును కృతకృత్యులు కాలేరు. పదే పదే వారు ఒనర్చిన కర్మలు అన్నియును వ్యర్థములే యగును.
మనుష్యుడు తనను వెంబడించు శారీరక, మానసిక దుఃఖముల నుండి ఎప్పుడునూ విముక్తుడు కాలేడు. మరణశీలులైన ఆ పురుషులు అనేక శ్రమలకు, కష్టములకు ఓర్చి, ధనమును, భోగ్యవస్తువులను పొందినప్పటికినీ వాటి వలన ప్రయోజనము ఏముండును?

ఇంద్రియములకు వశులైన లోభులగు ధనికుల దుఃఖములను నేను చూచుచునే యున్నాను. భయమునకు లోనైనవారికి నిద్రపట్టదు. అందరినీ సందేహించుచుందురు.

జీవితము పైనను, ధనము మీదను పేరాశగల లోభులు తమ ధనమును  రాజులు, చోరులు, శత్రువులు, స్వజనులు, పశుపక్ష్యాదులు, యాచకులు, కాలపురుషుడు దోచుకుందురేమోయని శంకించుచునే యుందురు. ఒక్కొక్కసారి పొరపాటున తమ ధనమును తామే అధికముగా ఖర్చుచేయుదునేమో యని భయపడుచునే యుందురు.

అందువలన, బుద్ధిమంతులు శోకమునకును, మోహమునకును, భయమునకును, క్రోధమునకును, రాగమునకును, పిరికితనమునకును, శ్రమకును కారణమైన ధనముపైనను, జీవితము మీదను కోరికను వదులుకొనవలెను.


ఈ లోకమున నాకు తేనెటీగ, కొండచిలువ గొప్ప గురువులు. అవి ఇచ్చిన సందేశము ప్రకారమే నాకు వైరాగ్యము, సంతోషములు అబ్బినవి.


తేనెటిగ కష్టపడి తేనెను సమకూర్చుకొనును. అట్లే జనులు ఎన్ని కష్టములనైనను భరించుచు ధనమును సంపాదించుకొందురు. కాని, దానిని ఇతరులు కాజేయుదురు. దీనివలన మనిషి విషయభోగములనుండి విరక్తుడు కావలెనని పాఠము నేర్చుకొంటిని.


కొండచిలువవలె నేను ఎట్టి ప్రయత్నములను చేయకుండా పడియుందును. దైవికముగా లభించిన దానితో సంతుష్టుడను అగుదును. ఏమియు దొరకనిచో పెక్కుదినములు ఓపిక బట్టి అట్లే పడియుండెదను.
లభించిన ఆహారము స్వల్పమైనను, అధికమైనను ఒకప్ఫుడు అది రుచికరముగా ఉన్నను, లేకున్నను, మరియొకప్పుడు అది షడ్రసోపేతముగా ఉన్నను, ఏ రుచితో లేకున్నను, నేను స్వీకరింతును. 

నాకు ఆహారపదార్థములను శ్రద్ధగా ఇచ్చినను లేక, చులకన భావముతో ఇచ్చినను వాటినిగూర్చి లెక్కసేయక  స్వీకరింతును. ఒక్కొక్కప్పుడు పగటియందును, మరియొకప్పుడు రాత్రుల యందు ఆహారము లభించును. అది ఎప్పుడు లభించినను దానిని భుజింతును. ఒక్కొక్కసారి భోజనము చేసిన పిమ్మట గూడ ఆహారము లభించును. దానిని గూడ మరల భుజింతుసు.

ప్రారబ్దవశమున దైవికముగా లభించిన దానితోడనే నేను తృప్తిపడుదును కనుక, నాకు పట్టు వస్త్రమైనను, ముతక వస్త్రమైనను,   మృగచర్మముగాని, నారచీరగాని, ఏ వస్తువు లభించినను దానినే ధరించెదను.


ఒక్కొక్కప్పుడు కటిక నేల పైనను, గడ్డిమీదను, ఆకుల మీదను, రాళ్ళపైనను, బూడిదపైనను శయనింతును. మరొకప్పుడు ఇతరులు సమకూర్చిన భవనముల యందలి పర్యంకములపైనను, పరుపుల మీదను పరుండెదను.


ప్రహ్లాదా! నేను అప్పుడప్పుడు శుభ్రముగా స్నానమాచరించి, శరీరముపై చందనములు అలంకరించుకొని, అందమైన వస్త్రములను, పుష్పహారములను, ఆభరణములను ధరింతును. రథముపై, ఏనుగుపై, గుర్రముపై తిరుగుచుందును. అప్పుడప్పుడు పిశాచమువలె దిగంబరముగ కూడా సంచరింతును. 

మనుష్యుల స్వభావములు వేర్వేరుగా నుండును. కనుక, నేను ఎవ్వరినీ నిందించుటగాని, స్తుతించుటగాని చేయను. కాని, ఈ మానవులకు శుభములు కలగాలని, వారికి పరమాత్మయందు భక్తిగలిగి సాయుజ్యము లభించాలని కోరుచుందును.
సత్యాన్వేషణము చేయు మనుష్యుడు పలు విధములైన పదార్థములను, వాటి భేదాభేదములను చిత్తవృత్తియందు హవనము చేయవలెను. ఈ చిత్తవృత్తిని ఈ పదార్థములకు సంబంధించిన వివిధ భ్రమలను కలిగించు మనస్సు నందు హోమము చేయవలెను. మనస్సును సాత్త్వికాహంకారముల యందును, దానిని మహత్తత్త్వము ద్వారా మాయయందు హవనము చేయవలెను. ఈ తీరుగా భేదా భేదములకు మాయయే కారణమని నిశ్చయించుకొని, ఆ మాయను ఆత్మానుభూతియందు లయము చేయవలెను. ఈ విధముగా ఆత్మ సాక్షాత్కారము ద్వారా ఆత్మస్వరూపమునందు స్థితుడై, నిష్క్రియుడై నివృత్తి మార్గమును అవలంబింప వలెను.

ప్రహ్లాదా! నా ఈ ఆత్మకథ అత్యంత గోప్యమైనది. లోకమునకు, శాస్త్రములకు అతీతమైనది. నీవు పరమ భాగవతోత్తముడవు. కనుక, నేను ఈ కథను వర్ణించితిని" అనుచు చెప్పెను.

నారద ఉవాచ
నారదుడు నుడివెను ధర్మరాజా! దైత్యరాజైన ప్రహ్లాదుడు దత్తాత్రేయుని ముఖతః పరమహంసల ధర్మములను విని, ఆ మునిని అర్చించెను. అనంతరము అతనిని వీడ్కొని, ప్రసన్నుడై తన రాజధానికి బయలుదేరెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే త్రయోదశోఽధ్యాయః (13)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు పదమూడవ అధ్యాయము (13)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



No comments:

Post a Comment