25.7.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
అష్టమ స్కంధము - మూడవ అధ్యాయము
గజేంద్రుడు భగవంతుని స్తుతించుట - ఆ ప్రభువు అతనిని రక్షించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
3.1 (ప్రథమ శ్లోకము)
ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనో హృది|
జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితమ్॥6392॥
శ్రీశుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! గజేంద్రుడు ఈ విధముగా తన బుద్ధితో నిశ్చయించుకొని, ఏకాగ్రచిత్తుడాయెను. పూర్వజన్మలో తాను నేర్చుకొనిన స్తోత్రపాఠము ద్వారా భగవంతుని ఈ విధమగా స్తుతింపసాగెను.
గజేంద్ర ఉవాచ
3.2 (రెండవ శ్లోకము)
ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకమ్|
పురుషాయాదిబీజాయ పరేశాయాభిధీమహి॥6393॥
గజేంద్రుడు ఇట్లు స్తుతించెను - పరమాత్మా! నీవే జగత్తునకు మూలకారణుడవు. అందరి హృదయములలో విరాజిల్లుచున్న పరమ పురుషుడవు. సమస్త జగత్తునకు నీవే ఏకైక ప్రభుడవు. నీ వలననే ఈ విశ్వము చైతన్యవంతమైనది. నిన్ను భక్తితో ధ్యానించుచున్నాను. నీకు నమస్కారములు.
3.3 (మూడవ శ్లోకము)
యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయమ్|
యోఽస్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువమ్॥6394॥
ఈ జగత్తు నీ యందే నిలిచియున్నది. నీ సత్తా ద్వారానే అది ప్రతీతమగుచున్నది. ఈ జగత్తునందు వ్యాపించి ఈ రూపముననే ప్రకటితము అగుచున్నావు. ఐనను, ఈ విశ్వమునకు కారణమై, ప్రకృతికి అతీతుడవు. స్వయం ప్రకాశకుడవు నీవే. అట్టి నిన్ను శరణు వేడుచున్నాను.
పోతనామాత్యుల వారి పద్యము
ఉత్పలమాల
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని
......లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ
......డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు;
......సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు
...... నే శరణంబు వేడెదన్
తాత్పర్యము
ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.
3.4 (నాలుగవ శ్లోకము)
యః స్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వ చ తత్తిరోహితమ్|
అవిద్ధదృక్సాక్ష్యుభయం తదీక్షతే స ఆత్మమూలోఽవతు మాం పరాత్పరః॥6395॥
ఈ విశ్వము అంతయు ఆ ప్రభువు యొక్క మాయా ప్రభావమున అతనియందే అధ్యస్తమై యున్నది. అది ఒక్కొక్కప్పుడు ప్రతీతమగుచుండును. ఒక్కొక్కప్పుడు తిరోహితము అగుచుండును. కాని, ఆ ప్రభువు దీనికి ఏకైక సాక్షిగా సుండి, దాని ఆవిర్భావ, తిరోభావములను గమనించుచుండును. సమస్త కార్య కారణములకును అతడు అతీతుడు. అట్టి ప్రభువు నన్ను రక్షించుగాక!
3.5 (ఐదవ శ్లోకము)
కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు|
తమస్తదాసీద్గహనం గభీరం యస్తస్య పారేఽభివిరాజతే విభుః॥6396॥
ప్రళయ కాలమున సకల లోకములు, లోకపాలురు, అన్నింటికిని కారణమైన మహత్తత్త్వము మున్నగునవి ఆ పరమాత్మలో లీనమగును. ఆ సమయమున అంతటను దట్టమైన అంధకారము అలముకొని యుండును. కాని, అనంతుడైన ఆ పరమాత్మ అన్ని విధములుగా దానికి అతీతుడై తన పరంధామమునందు ప్రకాశించుచుండును. అట్టి ప్రభువు నన్ను రక్షించుచుండుగాక.
పోతనామాత్యుల వారి పద్యము
కంద పద్యము
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
తాత్పర్యము
లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం; ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను
3.6 (ఆరవ శ్లోకము)
న యస్య దేవా ఋషయః పదం విదుర్జంతుః పునః కోఽర్హతి గంతుమీరితుమ్|
యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణః స మావతు॥6397॥
భగవంతుని లీలా రహస్యములను తెలిసికొనుట మిక్కిలి కష్టము. ఆయన నటునివలె పెక్కు వేషములను (అవతారములను) దాల్చుచుండును. ఆయన వాస్తవ స్వరూపమును దేవతలుగాని, మహర్షులు గాని తెలిసికొనజాలరు. అట్టి పరమ పురుషుని చేరుటకును, వర్ణించుటకును నా వంటి అల్ప ప్రాణికి (జంతువునకు) ఎట్లు సాధ్యమగును? అట్టి ప్రభువు నన్ను రక్షించుచుండుగాక?
3.7 (ఏడవ శ్లోకము)
దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్తసంగా మునయః సుసాధవః|
చరంత్యలోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః స మే గతిః॥6398॥
ఆ పరమాత్ముని యొక్క స్వరూపము వరకు శుభంకరము. దానిని దర్శించుటకై మునులు సంసారమునందలి సమస్త ఆసక్తులను పరిత్యజించి, వనములలో బ్రహ్మచర్యము అవలంబించి, అలౌకిక వ్రతములను పాటించెదరు. వారు తమ ఆత్మలయందు సకల జీవులను సమభావముతో దర్శించి, సహజముగా అందరి హితములను అభిలషింతురు. అట్టి మహాత్ములకు సర్వస్వము ఐనవాడు ఆ పరమాత్మయే. ఆ సర్వేశ్వరుడే నాకును గతి.
పోతనా మాత్యులవారి పద్యము
ఆటవెలది
ముక్తసంగులైన మునులు దిదృక్షులు
సర్వభూత హితులు సాధుచిత్తు
లసదృశవ్రతాఢ్యులై కొల్తు రెవ్వని
దివ్యపదము వాఁడు దిక్కు నాకు.
తాత్పర్యము
ప్రపంచంతో సర్వ సంబంధాలు వదలివేసిన మునులు, భగవద్దర్శనం కోరేవారు, సమస్తమైన జీవుల మేలు కోరేవారు, మంచి మనసు కలవారు సాటిలేని వ్రతాలు ధరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు అగు గాక.
3.8 (ఎనిమిదవ శ్లోకము)
న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా|
తథాపి లోకాప్యయసంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి॥6399॥
ఆ పరమాత్మకు జన్మ, కర్మలుగాని, నామ రూపములు గాని, తత్సంబంధమైన గుణ దోషములుగాని లేవు. ఐనను, లోకముల సృష్టి, స్థితి, లయములకై ఆయా సమయములయందు జన్మ, కర్మ, నామ, రూప, గుణములను అతడు తన మాయచే స్వీకరించుచుండును.
3.9 (తొమ్మిదవ శ్లోకము)
తస్మై నమః పరేశాయ బ్రహ్మణేఽనంతశక్తయే|
అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే॥6400॥
అనంత శక్తిమంతుడు, సర్వైశ్వర్యమయుడు, ఐన పరమాత్మకు నేను నమస్కరించుచున్నాను. ఆయన ఎట్టి రూపములు లేనివాడైనను, అన్ని రూపములును ఆయనవే. ఆయన చేసెడు లీలలు మిక్కిలి ఆశ్చర్యకరములు. అత్యద్భుతములు. ఆయన పాదములకు పదేపదే నమస్కారములు.
3.10 (పదియవ శ్లోకము)
నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే|
నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి॥6401॥
పరమాత్మ స్వయంప్రకాశుడు, సర్వసాక్షి. మనస్సునకు, వాక్కులకు, చిత్తమునకు అందనివాడు. అట్టి పరమాత్మకు అనేక నమస్కారములు.
3.11 (పదకొండవ శ్లోకము)
సత్త్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా|
నమః కైవల్యనాథాయ నిర్వాణసుఖసంవిదే॥6402॥
వివేకవంతుడు కర్మ సన్న్యాసము వలనగాని, కర్మ సమర్పణ వలనగాని, తన అంతః కరణమును పవిత్రమొనర్చుకొని ఆ పరమాత్మను ఆత్మరూపముగా పొందును. అతడు స్వయముగా నిత్యముక్తుడై, పరమానంద జ్ఞానస్వరూపుడు అగుటయేకాక మోక్షాధిపతి మోక్ష (కైవల్య-ముక్తి) ప్రదాతయగు భగవానుడే మోక్షానందుము యొక్క అనుభవమే స్వరూపముగా ఉన్నవాడు. అట్టి పరమాత్మకు నమస్కారము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
26.7.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
అష్టమ స్కంధము - మూడవ అధ్యాయము
గజేంద్రుడు భగవంతుని స్తుతించుట - ఆ ప్రభువు అతనిని రక్షించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
3.12 (పండ్రెండవ శ్లోకము)
నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే|
నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ॥6403॥
ఆ దేవదేవుడు సత్త్వ, రజ, స్తమో గుణముల ధర్మములను స్వీకరించి, క్రమముగా, శాంతస్వరూపుడుగను, ఘోరుడుగను, మూఢుడుగను భాసించును. ఐనను, భేదరహితుడై, సమభావముతో నున్న ఆ జ్ఞానస్వరూపునకు నేను పదేపదే ప్రణమిల్లుచున్నాను.
3.13 (పదమూడవ శ్లోకము)
క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే|
పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమః॥6404॥
సర్వమునకు అధ్యక్షుడు, సర్వాధీశ్వరుడు అగు పరమేశ్వరుడే దేహేంద్రియ మనస్సంఘాతములు అన్నింటియందు చైతన్యస్వరూపుడై సర్వసాక్షిగా వెలుగొందుచున్నాడు. ఆయన తనకు తానే కారణమైనట్టి సర్వకారణుడు. పూర్ణపురుషుడగు ఆ పరమేశ్వరుడు మూలప్రకృతి (మాయాశక్తి) కి అధిష్ఠానమై యున్నాడు. అట్టి పరమప్రభువునకు అనేకానేక నమస్కారములు.
3.14 (పదునాలుగవ శ్లోకము)
సర్వేంద్రియగుణద్రష్ట్రే సర్వప్రత్యయహేతవే|
అసతాచ్ఛాయయోక్తాయ సదాభాసాయ తే నమః॥6405॥
నీవు సకల ప్రాణుల ఇంద్రియములకు, వాటి విషయములకు ద్రష్టవు. సమస్త ప్రాణుల జ్ఞానమునకు నీవే ఆధారము. ఈ విశ్వమునందలి అసద్వస్తువుల నిరాకరణముద్వారా నీ సత్తాస్వరూపము కనుగొనబడును. సమస్త వస్తువుల సత్తా రూపముల యందు గూడ కేవలము నీవే భాసిల్లుచుందువు. అట్టి నీకు నమస్కారము.
3.15 (పదునైదవ శ్లోకము)
నమో నమస్తేఽఖిలకారణాయ నిష్కారణాయాద్భుతకారణాయ|
సర్వాగమామ్నాయమహార్ణవాయ నమోఽపవర్గాయ పరాయణాయ॥6406॥
సర్వమునకు మూలకారణమైన నీకు వేరొకకారణము లేదు. మూల కారణము ఐనప్పటికినీ అనగా సర్వము నీ నుండియే ఉద్భవించినా, సర్వము నీ యందు వాస్తవముగా లేదు. అట్టి అద్భుతమగు ఆశ్చర్యమును గొలిపెడి జగత్కారణుడవు నీవు. సమస్త నదీనదములు సముద్రమునందు కలిసిపోయినట్టుగా సకలములైన శాస్త్రములు, వేదములు నీయందే పర్యవసానము నొందుచున్నవి. నీవే మోక్షస్వరూపుడవు. సమస్త సాధకులు పొందెడు సర్వాశ్రయమైనట్టి సర్వోత్తమమైన గతివి నీవే. అట్టి నీకు అనేక నమస్కారములు.
3.16 (పదునారవ శ్లోకము)
గుణారణిచ్ఛన్నచిదూష్మపాయ తత్క్షోభవిస్ఫూర్జితమానసాయ |
నైష్కర్మ్యభావేన వివర్జితాగమస్వయంప్రకాశాయ నమస్కరోమి॥6467॥
నిప్ఫును అరణి (అగ్నికొరకు మధించెడు కొయ్య) దాచిపెట్టినట్లుగా, సత్ప్వము, రజస్సు, తమస్సు అనెడు త్రివిధగుణముల కార్యమగు దేహాదికము, జ్ఞానఘనమగునట్టి ఆత్మను కప్పివేయును. సృష్ట్యాదిలో ఆ త్రివిధగుణములయందు క్షోభను కలిగించి తద్ద్వారా జగద్రూపముగా ప్రకటము కావలెననెడు సంకల్పము భగవానునియందు కలిగెను. సకల కర్మల సంగము లేనివాడైనట్టి నిష్కాములై ఆత్మతత్ప్వమునందు నిష్ఠగా నిలిచియున్నవారై, విధినిషేధముల పరిధిని పూర్తిగా దాటిపోయిన మహాత్ములయందు ఆ భగవానుడు ఆత్మస్వరూపుడుగా సాక్షాత్కరించును. అట్టి భగవానునకు నేను నమస్కరించుచున్నాను.
3.17 (పదునేడవ శ్లోకము)
మాదృక్ ప్రపన్నపశుపాశవిమోక్షణాయ ముక్తాయ భూరికరుణాయ నమోఽలయాయ|
స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీతప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే॥6408॥
నేను నీ శరణుగోరినవాడను. బంధింపబడిన పశువు యొక్క బంధములను ఛేదించునట్లు నీవు నావంటి శరణాగతుల సంసార బంధములను ఛేదించెడు దయామూర్తివి. నీవు నిత్య ముక్తుడవు. పరమ కరుణామయుడవు. భక్తులకు శుభములను చేకూర్చుటలో నీవు ఎన్నడును ఆలస్యము చేయువు. సకలప్రాణుల హృదయములలో అంశగానుండి, అంతరాత్మ రూపమున వెలుగొందుచుందువు. నీవు షడ్గుణైశ్వర్య సంపన్నుడవు. అనంతుడవు. నీకు నమస్కారములు.
పోతనామాత్యులవారి పద్యములు
8-78-సీస పద్యము
భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నా;
హ్వయమును గుణము లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించు కొఱకునై;
నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు
నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ;
కిద్ధరూపికి రూపహీనునకునుఁ
జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ;
బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకు
8-78. ఆటవెలది
మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ
గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచు
నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.
తాత్పర్యము
భగవంతుడికి పుట్టుక, పాపము, ఆకారం, కర్మలు, నామలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించడానికి, నశింపజేయడానికి తన మాయా ప్రభవంతో ఇవన్నీ ధరిస్తాడు. అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపంగలవాడు, ఏ రూపంలేనివాడు, చిత్రమైన ప్రవర్తన కల వాడు, సర్వసాక్షి, ఆత్మప్రకాశమైన వాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు ఊహలకు అందని వాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిజేర దగినవాడు మరియు నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలను మెచ్చువాడు అయినట్టి ఆ దేవదేవునికి నేను నమస్కారాలు చేస్తాను.
8-79- సీస పద్యము
శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి;
నిర్వాణ భర్తకు నిర్విశేషు
నకు; ఘోరునకు గూఢునకు గుణధర్మికి;
సౌమ్యున కధిక విజ్ఞాన మయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు;
క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి;
య జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి
8-79.1-ఆటవెలది
నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిల కారణునకు నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.
తాత్పర్యము
భగవంతుడు శాంతస్వరూపుడు. పరలోక సౌఖ్యప్రదాత. మోక్షానికి అధిపతి. నిర్విశేషుడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్దులకు అందనివాడు. సర్వ గుణ ధర్మాలు కలవాడు. సరళ స్వభావి. విశేషమైన ఙ్ఞానము కలవాడు. సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు. సమస్తానికి ప్రభువు. బహు క్షేత్రఙ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. సర్వానికి ఆది మూల పురుషుడు. ఆత్మకు ఆధారమైనవాడు. సకల ఇంద్రియాలకు నియామకుడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడతో ప్రకాశించే బహు నేర్పరి. మిక్కిలి గొప్పవాడు. సమస్తానికి ఆది బీజం అయినవాడు. తనకి మూల కారణం ఏది లేనివాడు. అట్టి ఆ దేవ దేవునికి నన్ను కాపాడమంటు నమస్కరిస్తున్నాను.
8-80 కంద పద్యము
యోగాగ్ని దగ్ధకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొం డెఱుఁగక స
ద్యోగ విభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్.
తాత్పర్యము
యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వ కర్మలను కాల్చివేసి. ఇతరమైనది మరేది తలచకుండ ప్రకాశించే తమ మనసులలో ఆ దేవదేవుని చూస్తు ఉంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను.
8-81-సీ.సీస పద్యము
సర్వాగమామ్నాయ జలధికి నపవర్గ;
మయునికి నుత్తమ మందిరునకు
సకలగుణారణిచ్ఛన్న బోధాగ్నికిఁ;
దనయంత రాజిల్లు ధన్యమతికి
గుణలయోద్దీపిత గురు మానసునకు సం;
వర్తితకర్మనిర్వర్తితునకు
దిశ లేని నా బోఁటి పశువుల పాపంబు;
లడఁచువానికి సమస్తాంతరాత్ముఁ
8-81.1-ఆటవెలది
డై వెలుంగువాని కచ్ఛిన్నునకు భగ
వంతునకుఁ దనూజ పశు నివేశ
దారసక్తు లయినవారి కందఁగరాని
వాని కాచరింతు వందనములు.
తాత్పర్యము
పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూపమైన సముద్రము వంటివాడు. మోక్షస్వరూపుడు. గొప్ప గుణాలకు నిలయమైన వాడు. ఆరణి కొయ్యలలోని అగ్నివలె సుగుణాలలో దాగి ఉండేవాడు. స్వయం ప్రకాశకుడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయాన్ని సృష్టిని నడిపేవాడు. నాలాంటి ఏ దిక్కులేని జీవుల పాపాలను శమింపజేసేవాడు. సర్వులలోను ఆత్మయై వెలగువాడు. నాశనం లేనివాడు. పూజింప దగినవాడు. భార్యా పుత్రులు ఇల్లు పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నమస్కారాలు చేస్తాను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
[03:34, 27/07/2020] +91 95058 13235: 27.7.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
అష్టమ స్కంధము - మూడవ అధ్యాయము
గజేంద్రుడు భగవంతుని స్తుతించుట - ఆ ప్రభువు అతనిని రక్షించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
3.27 (ఇరువది ఏడవ శ్లోకము)
యోగరంధితకర్మాణో హృది యోగవిభావితే|
యోగినో యం ప్రపశ్యంతి యోగేశం తం నతోఽస్మ్యహమ్॥6418॥
యోగులు యోగ సాధన ద్వారా వారి కర్మలను, కర్మ వాసనలను, కర్మ ఫలములను, భస్మము చేయుదురు. యోగముచే పునీతమైన తమ హృదయముల యందు యోగేశ్వరుడైన ఆ పరమాత్మను సాక్షాత్కరింపజేసి కొందురు. అట్టి ప్రభువునకు నమస్కారము.
3.28 (ఇరువది ఎనిమదవ శ్లోకము)
నమో నమస్తుభ్యమసహ్యవేగశక్తిత్రయాయాఖిలధీగుణాయ|
ప్రపన్న పాలాయ దురంతశక్తయే కదింద్రియాణామనవాప్యవర్త్మనే॥6419॥
సత్త్వరజస్తమములనెడి నీ భక్తుల యొక్క రాగాదుల వేగము దుర్భరమైనది. ఇంద్రియముల యొక్క, మనసు యొక్క విషయరూపములయందు గూడ నీవే ప్రతీతమగుచుందువు. కనుక, ఇంద్రియములను వశములో నుంచుకొనని వారికి నిన్ను చేరెడి మార్గము గూడ లభింపదు. నీ శక్తి అనంతము. నీవు శరణాగతవత్సలుడవు. అట్టి నీకు పదే పదే నమస్కారములు.
పోతనామాత్యులవారి పద్యము
శార్దూల విక్రీడితము
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె;
......బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్
......డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ;
......మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద!
......సంరక్షింపు భద్రాత్మకా!
తాత్పర్యము
దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!
3.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
నాయం వేద స్వమాత్మానం యచ్ఛక్త్యాహంధియా హతం|
తం దురత్యయమాహాత్మ్యం భగవంతమితోఽస్మ్యహమ్॥6420॥
నీ మాయా ప్రభావమున అహంకారము ఆత్మ స్వరూపమును కప్పివేయుచున్నది. కనుక జీవుడు తన నిజ స్వరూపమును తెలిసికొనలేకున్నాడు. నీ మహిమ అపారము. సర్వ శక్తిమంతుడవు. మాధుర్యనిధియు ఐన నిన్ను శరణు వేడుచున్నాను.
శ్రీశుక ఉవాచ
3. 30 ముప్పదియవ శ్లోకము)
ఏవం గజేంద్రముపవర్ణితనిర్విశేషం బ్రహ్మాదయో వివిధలింగభిదాభిమానాః|
నైతే యదోపససృపుర్నిఖిలాత్మకత్వ త్తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్॥6421॥
శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! గజేంద్రుడు ఎట్టి భేదభావము లేకుండా నిర్విశేష రూపముగల భగవంతునిస్తుతించెను. కనుక, వేర్వేరు నామ రూపములను తమ స్వరూపములుగా భావించునట్టి బ్రహ్మాది దేవతలు అతనిని (గజేంద్రుని) రక్షించుటకై రాలేదు. కాని, సర్వదేవస్వరూపుడైన శ్రీహరి సర్వాత్ముడు అగుట వలన ఆ సమయమున స్వయముగా అచట ప్రత్యక్షమాయెను.
3.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
తం తద్వదార్తముపలభ్య జగన్నివాసః స్తోత్రం నిశమ్య దివిజైః సహ సంస్తువద్భిః|
ఛందోమయేన గరుడేన సముహ్యమానశ్చక్రాయుధోఽభ్యగమదాశు యతో గజేంద్రః॥6422॥
గజేంద్రుడు మిక్కిలి ఆర్తితో నున్నట్లు విశ్వమునకు ఒకే ఆధారమైన శ్రీమహావిష్ణువు గ్రహించెను. కనుక, అతని స్తుతిని విన్నంతనే చక్రధారియైన శ్రీహరి వేదమయుడైన గరుత్మంతునిపై వెంటనే గజేంద్రుడున్న ప్రదేశమున ప్రకటమాయెను.
3.32 (ముప్పది రెండవ శ్లోకము)
సోఽన్తఃసరస్యురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరిం ఖ ఉపాత్తచక్రమ్|
ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛ్రాన్నారాయణాఖిలగురో భగవన్నమస్తే॥6423॥
సరోవర జలములయందు మిగుల బలీయమైన మొసలి గజేంద్రుని పాదమును పట్టుకొనియుండెను. ఆ గజము మిగుల వ్యాకులతతో ఉండెను. అట్లయ్యును శ్రీహరి గరుడారూఢుడై, చక్రమును ధరించి, ఆకాశమున వచ్చుచున్నట్లు గమనించెను. అప్పుడు అతడు తన తొండముతో ఒక కమలమును ధరించి, పైకెత్తి నారాయణా! జగద్గురూ! పరమాత్మా! నీకు నమస్కారము అని అతి కష్టము మీద పలికెను.
(పోతనామాత్యుల వారి పద్యములు ఇంతవరకు సందర్భముననుసరించి ఇవ్వబడినవి. ఇక్కడ నుండి మకరము సంహరింపబడువరకూ పోతనామాత్యులవారు ఆయన సృజనాత్మకతననుసరించి వర్ణన చేశారు. ఆకారణంచే ఈ సందేశమునకు అనుబంధంగా వేరొక సందేశంలో అలవైకుంఠపురంబులో, సిరికింజెప్పడు, తనవెంటన్ సిరి మొదలైన పద్యములు ప్రత్యేకముగా ఈయబడినవి).
3.33 (ముప్పది మూడవ శ్లోకము)
తం వీక్ష్య పీడితమజః సహసావతీర్య సగ్రాహమాశు సరసః కృపయోజ్జహార|
గ్రాహాద్విపాటితముఖాదరిణా గజేంద్రం సంపశ్యతాం హరిరమూముచదుచ్ఛ్రియాణాం॥6424॥
జన్మరహితుడైన శ్రీమహావిష్ణువు అతి దైన్యముతో నున్న గజేంద్రుని చూచెను. వెంటనే ఆ ప్రభవు ఒక్క ఉదుటున గరుడుని మూపునుండి క్రిందికి దూకెను. దయాళుడైన ఆ ప్రభువు వెంటనే గజేంద్రుని, మొసలిని గూడ సరోవరము నుండి బయటికి లాగెను. పిదప సకల దేవతలు చూచుచుండగనే భక్త వత్సలుడైన శ్రీహరి చక్రముతో మొసలి శిరస్సును ఖండించి, గజేంద్రుని రక్షించెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే తృతీయోఽధ్యాయః (3)
ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు మూడవ అధ్యాయము (3)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319
[03:34, 27/07/2020] +91 95058 13235: 27.7.2020 ప్రాతః కాల సందేశం
శ్రీమదాంధ్ర మహాభాగవతం - గజేంద్రమోక్షం
పోతనామాత్యుల పద్యము
8-87-సీస పద్యము
కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ;
గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ;
బడిన సాధుల కడ్డపడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ;
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల;
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?
8-87.1-తేటగీతము
అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?
తాత్పర్యము
నా విషయంలో ఆ భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదు. అతడు ఐశ్వర్యం పేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. మొదలు నడుమ తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?
8-90-శా.శార్దూల విక్రీడితము
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
తాత్పర్యము
దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!
8-91 కంద పద్యము
విను దఁట జీవుల మాటలు
చను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో
యను దఁట పిలిచిన సర్వముఁ
గను దఁట సందేహ మయ్యెఁ గరుణావార్ధీ!
తాత్పర్యము
ఓ దయాసాగరా! నీవు సర్వ ప్రాణుల పిలుపులు వింటావట. వారిపై దయ చూపడానికి పోరాని చోట్లకు ఐనా పోతావట. శరణన్న వారికి వెంటనే ఓయ్ అని అంటావుట.కాని ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది.
ఉత్పలమాల
ఓ! కమలాప్త! యో! వరద! యో!
.....ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య!
.....సుగుణోత్తమ! యో! శరణాగతామరా
నోకహ! యో! మునీశ్వర మనోహర!
......యో! విమలప్రభావ! రా
వే కరుణింపవే తలఁపవే
......శరణార్థిని నన్నుగావవే.
తాత్పర్యము
ఓ కమలాక్షుడా! ఓ వరాలు ఇచ్చే ప్రభూ! శత్రువులపై కూడ వైరం లేనివాడా! పండితులచే నమస్కారాలు అందుకొనే వాడా! ఉత్తమ సుగుణాలు కలవాడా! శరణు కోరు వారికి కల్పవృక్షం వంటివాడా! మునీంద్రులకు ప్రియమైనవాడా! నిర్మలమైన మహిమ కల వాడా! నా మొర విను. వెంటనే రా. కనికరించు. కరుణించి శరణు వేడుతున్న నన్ను కాపాడు.
8-93 వచనము
అని పలికి మఱియు నరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుఁడైన నన్నుఁ గాచుఁ గాక యని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగడించుచు బయ లాలకించుచు నగ్గజేంద్రుండు మొఱచేయుచున్న సమయంబున.
తాత్పర్యము
ఇలా ప్రార్థించి “రక్షణ లేనివారిని రక్షించే ఆ భగవంతుడు నన్ను కాపాడుగాక!” అని గజరాజు మొరపెట్టుకొన్నాడు. ఆకాశం వైపు నిక్కి నిట్టూర్చాడు. ఆకాశానికి చెవులు అప్పజెప్పి ఆక్రోశించాడు. ఆ సమయంలో.
8-94 ఆటవెలది
విశ్వమయత లేమి వినియు నూరక యుండి
రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు
భక్తియుతున కడ్డపడఁ దలంచె.
తాత్పర్యము
ఆ సమయంలో బ్రహ్మదేవుడు మొదలగు వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేకపోవుటచేత గజరాజు మొర వినబడినా వారు అడ్డుపడకుండ ఊరికే ఉండిపోయారు. విశ్వమంతా వ్యాపించే వాడు, ప్రభువు, విజయశీలి ఐన విష్ణువు భక్తుడైన గజరాజును రక్షించాలని నిశ్చయించుకొన్నాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఇక్కడ భాగవత రచన చేస్తున్న పోతన గారికొక విచిత్రమైన సమస్య ఏర్పడింది. ఆయన వైకుంఠవాసియైన శ్రీమహావిష్ణువు ఉన్న వైకుంఠాన్ని వర్ణంచే పద్యం ప్రారంభించారు.
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల అంటూ మత్తేభవిక్రీడిత పద్యం వ్రాయడం ప్రారంభించారు.
అదే వైకుంఠాన్ని వర్ణించాలి . తానేమో చూడలేదు . తనకంటే ముందు ఎవరూ వర్ణించిన దాఖలాలు లేవు . ఏం చేయాలి ? భాగవత రచనను ఎలా సాగించాలి? ఈ అలోచనలతో సతమతమౌతూ , కొంత సమయం భాగవత రచనను నిలిపి వేసి , స్నానంచేయడానికా గోదావరికి బయలు దేరాడు పోతనగారు. అంతలో భక్తుడంటే భగవంతునికి అపారమైన ప్రేమ కదా! పోతన స్నానానికి బయలుదేరగానే పోతన వేషంలో భగవంతుడు వచ్చి , గజేంద్రుడు “పాహి , పాహి ” అని ఆర్తితో పిలిచిన సమయంలో తనెక్కడున్నాడో , తానేమి చేస్తున్నాడో వర్ణించే మధురమైన పై పద్యాన్ని పూర్తిచేసి వెళ్ళిపోయాడు.
8-
8-96 మత్తేభ విక్రీడితము
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.
తాత్పర్యము
గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.
8-97-వ.వచనము
ఇట్లు భక్తజనపాలన పరాయణుండును; నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును నగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి; లక్ష్మీకాంతా వినోదంబులం దగులు చాలించి; సంభ్రమించి దిశలు నిరీక్షించి; గజేంద్రరక్షాపరత్వంబు నంగీకరించి; నిజపరికరంబు మరల నవధరించి గగనంబున కుద్గమించి వేంచేయు నప్పుడు.
తాత్పర్యము
హరి భక్తులను ప్రోచుట యందు అనురక్తి గలవాడు. సర్వ ప్రాణుల హృదయాలనే పద్మాలలో నివసించేవాడు. ఆయన గజేంద్రుని మొరలన్నీ విన్నాడు. లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించాడు. ఆత్రుత చెంది అటునిటు చూసి గజేంద్రుని కాపాడుట అనే బరువైన బాధ్యత తీసుకొని అటుపిమ్మట ఆయుధాలను అవధరించి ఆకాశమార్గాన బయలుదేరాడు. ఆ సమయంలో.
8-98 .మత్తేభ విక్రీడితము
తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.
తాత్పర్యము
అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించటం కోసం లక్ష్మీదేవి కొంగు వదలను కూడ వదలకుండా తటాలున బయలుదేరటంతో – విష్ణువు వెనుక లక్ష్మీ దేవి, ఆమె వెనకాతల అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడుడు, ఆయన పక్కనే విల్లూ గదా శంఖచక్రాలు నారదుడు విష్వక్సేనుడు వస్తున్నారు. వారి వెనువెంట వరసగా వైకుంఠపురంలో ఉన్న వాళ్ళందరు కూడా వస్తున్నారు.
ఇది పోతనగారు ప్రసాదించిన పరమాద్భుత పద్యాలలో ఒకటి. పండిత పామరుల నోళ్ళలో తరచుగా నానుతుండే పద్యం. నడకలో భావంలో ఉత్తమ స్థాయి అందుకున్నది. చదువుతుంటేనే వేగంగా పయనమౌతున్న విష్ణుమూర్తి వెనుక అంత వేగంగాను వెళ్తున్న లక్ష్మీదేవి సూదిమొనగా గల బాణంములుకులాగ అనుసరిస్తున్న పరివారం మనోనేత్రానికి దర్శనమిస్తుంది. *{విష్ణుమూర్తి - (అ) ఆయుధములు 1) ధనుస్సు శారఙ్గము, 2) గద కౌమోదకి 3) శంఖము పాంచజన్యము, 4) చక్రము సుదర్శనము, 5) కత్తి నందకము (ఆ) రథము శతానందము (ఇ) సేనానాయకుడు విష్వక్సేనుడు (ఈ) వాహనం గరుత్మంతుడు}
8-99-వ.వచనము
తదనంతరంబ, ముఖారవింద మకరందబిందు సందోహ పరిష్యందమానానం దేందిందిర యగు న య్యిందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవ్యానచేలాంచల యై పోవుచు.
తాత్పర్యము
అప్పుడు పద్మం వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకరందం బిందువులు వంటి తియ్యటి చెమట బొట్లకు తుమ్మెదలు ఆనందంతో ముసిరాయి. విష్ణుమూర్తి తన పైట కొంగు పట్టుకొని లాక్కుపోతుంటే వైకుంఠుని వెన్నంటి పోతూ ఇలా అనుకుంది.
8-100 మత్తేభ విక్రీడితము
తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ; డనాథస్త్రీ జనాలాపముల్
వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్?
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం
గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్.
తాత్పర్యము
“ఎందుచేతనో విభుడు తాను వెళ్ళే చోటు చెప్పటం లేదు. దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో ఏమో? దుర్మార్గులు ఐన దొంగలు ఎవరైనా వేదాలను దొంగిలించారేమో? దేవతల రాజధాని అమరావతిపై రాక్షసులు దాడి చేసారేమో? విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటు దుర్మార్గులు భక్తులను బెదిరిస్తున్నారో ఏమో?” అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది.
8-102 శార్దూల విక్రీడితము
తాటంకాచలనంబుతో; భుజనటద్ధమ్మిల్లబంధంబుతో;
శాటీముక్త కుచంబుతో; నదృఢచంచత్కాంచితో; శీర్ణలా
లాటాలేపముతో; మనోహరకరాలగ్నోత్తరీయంబుతోఁ;
గోటీందుప్రభతో; నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్.
తాత్పర్యము
గజేంద్రుని కాపాడాలని పరుగు పరుగున వెళ్తున్న భర్త వెంట కోటి చంద్రుల కాంతి నిండిన ముఖంతో లక్ష్మీదేవి వెళుతోంది. అప్పుడు ఆమె చెవి లోలకులు కదుల్తున్నాయి. భుజాల మీద వీడిన కొప్పుముడి చిందు లేస్తోంది. స్తనాలపై పైటకొంగు తొలగిపోయింది. ఒడ్డాణం వదులై పోయింది. నుదిటి మీద రాసుకొన్న లేపనం చెదిరిపోయింది. మోము కోటి చంద్రుల కాంతితో నిండిపోయింది. స్తనాల భారంతో నడుం చిక్కిపోయింది. ఆమె పైట కొంగు ప్రియభర్త చేతిలో చిక్కుకొనే ఉంది.
8-103 కంద పద్యము
అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.
తాత్పర్యము
అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదా మని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది.
కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి –
ఈ పద్యంచూస్తున్నామా వింటున్నామా చదువుతున్నామా అనిపిస్తుంది. సందర్భానికి తగిన పలుకుల నడకలు. భావాన్ని స్ఫురింపజేసే పద ధ్వని. ఇంకా ఆపైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వలఘు కంద పద్యం ప్రయోగం. ఆహా ఏమి పద్యం.
8-104 సీస పద్యము
నిటలాలకము లంట నివుర జుంజుమ్మని;
ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు;
నళులఁ జోపఁగఁ జిల్క లల్ల నల్లన చేరి;
యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు;
శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం;
దాకినీ పాఠీనలోక మెసఁగు;
మీన పంక్తుల దాఁట మెయిదీఁగతో రాయ;
శంపాలతలు మింట సరణిఁ గట్టు;
8-104.1 ఆటవెలది
శంపలను జయింపఁ జక్రవాకంబులుఁ
గుచయుగంబుఁ దాఁకి క్రొవ్వుజూపు;
మెలఁత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁ బోలె
జలదవర్ణు వెనుకఁ జనెడునపుడు.
తాత్పర్యము
మేఘం వెంట మెరుపు తీగ వలె లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంట వెళ్ళసాగింది. ఆ సమయంలో ఆమె నుదుటి మీది ముంగురులను చక్కదిద్దుకోబోతే, పద్మంలాంటి ఆమె మోము నిండా తుమ్మెదలు ముసురుకున్నాయి. వాటిని తోలుతుంటే, ఆమె పెదవులను చూసి దొండపం డనుకొని చిలుకలు వచ్చి చేరాయి. చిలకలని తోలుతుంటే, చేపల లాంటి ఆమె కన్నులను చూసి ఆకాశగంగ లోని పెనుచేపలు ఎగసి పడ్డాయి. చేపలను తప్పించుకోగానే ఆమె శరీరపు మెరుపు చూసి ఆ దేహలతని ఒరుసుకోడానికి మెరుపు తీగలు బారులు తీరాయి. మెరుపు తీగలను దాటగానే, చక్రవాకపక్షుల జంటలు మిడిసి పాటుతో గుండ్రటి ఆమె స్తనద్వయాన్ని తాకాయి.
8-105 మత్తేభ విక్రీడితము
వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణావర్ధిష్ణుఁ యోగీంద్ర హృ
ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృందప్రాభవాలంకరి
ష్ణు నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్.
తాత్పర్యము
విష్ణుమూర్తి రాక్షసుల బతుకు తెరువులను నశింప జేసే వాడు, దయా రసంతో మించేవాడు, మహాయోగుల హృదయా లనే వనాలలో విహరించేవాడు, గొప్ప ఓర్పుగల వాడు, భక్తుల గొప్పదనాన్ని పెంపొందించేవాడు, నవయౌవనంతో వెలుగొందే లక్ష్మీదేవితో కలిసి విహరించే వాడు. జయశీలుడు, మహా కాంతిమంతుడు. అట్టి భగవంతుడిని ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూసారు.
8-107 మత్తేభ విక్రీడితము
చనుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
ఖ నినాదం బదె; చక్ర మల్లదె; భుజంగధ్వంసియున్ వాఁడె; క్ర
న్నన యేతెంచె నటంచు వేల్పులు నమోనారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.
తాత్పర్యము
గజేంద్రుని ఆర్తి బాపటానికి ఆరాటంగా ఆకాశంలో వెళ్తున్న శ్రీమహావిష్ణువును చూసి దేవతలు “అదిగదిగో మహనీయుడైన విష్ణుమూర్తి వస్తున్నాడు. అతని వెనుకనే శ్రీమహాలక్ష్మి వస్తున్నది చూడండి. అదిగో పాంచజన్య శంఖధ్వని. సర్పాలను సంహరించేవాడు గరుత్మంతుడు అదిగో చూడండి వెంట వస్తున్నాడు.” అనుకుంటు “నారాయణునికి నమస్కారం” అంటు నమస్కారాలు చేస్తున్నారు.
8-108 వచనము
అ య్యవసరంబునఁ గుంజరేంద్రపాలన పారవశ్యంబున దేవతానమస్కారంబు లంగీకరింపక మనస్సమాన సంచారుం డై పోయిపోయి కొంతదూరంబున శింశుమారచక్రంబునుం బోలె గురుమకరకుళీర మీనమిథునంబై; కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలె స్వచ్ఛ మకరకచ్ఛపంబై; భాగ్యవంతుని భాగధేయంబునుంబోలె సరాగ జీవనంబై; వైకుంఠపురంబునుంబోలె శంఖచక్ర కమలాలంకృతంబై; సంసార చక్రంబునుంబోలె ద్వంద్వసంకుల పంక సంకీర్ణంబై యొప్పు నప్పంకజాకరంబుఁ బొడగని.
తాత్పర్యము
ఆ సమయంలో గజేంద్రుడిని రక్షంచాలని వెళ్తున్న తొందరలో, విష్ణుమూర్తి దేవతల మొక్కులు అందుకోలేదు. అలా మనోవేగంతో వెళ్ళి, ఏనుగు మొసలి పోరాడుతున్న మడుగుని చూసాడు. ఆ మడుగులో శింశుమార చక్రంలో లాగ గొప్ప మొసళ్ళు, పీతలు, చేపలు జంటలు జంటలుగా ఉన్నాయి. కుబేరుని ధనాగారంలోని కచ్చపం అనే నిధి వంటి శ్రేష్ఠమైన తాబేళ్ళు ఉన్నాయి, ధనవంతుని సుఖజీవనంలోని అనురాగం లాగ ఎఱ్ఱని జీవనం (నీరు) నిండుగా ఉంది, వైకుంఠం వలె శంఖం, చక్రం (చక్రవాక పక్షులు), కమల (లక్ష్మి) లతో అలంకరింపబడి ఉంది. సుఖ దుఃఖాలనే ద్వంద్వాలతో నిండిన సంసారం వలె జలచరాల జంటలతో కలచబడిన బురద కలిగుంది.
8-109 మత్తేభ విక్రీడితము
కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స
త్త్వరితాకంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
పరిభూతాంబర శుక్రమున్ బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం
తరనిర్వక్రముఁ బాలితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్.
తాత్పర్యము
దయాసాగరుడైన నారాయణుడు మొసలిని చంప మని తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం భూమండలాన్ని కంపింప జేసే వేగం కలది. గొప్ప అగ్నికణాల జల్లుతో ఆకాశ మండలాన్ని కప్పివేసేది. అనేక విధమైన బ్రహ్మాండభాండాల సమూహాలలోను ఎదురు లేనిది. దేవతలను అందరిని కాపాడేది.
8-111 శార్దూల విక్రీడితము
అంభోజాకరమధ్య నూతన నలిన్యాలింగన క్రీడ నా
రంభుం డైన వెలుంగుఱేని చెలువారన్ వచ్చి నీటన్ గుభుల్
గుంభద్ధ్వానముతోఁ గొలంకును కలంకం బొందఁగా జొచ్చి దు
ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై.
తాత్పర్యము
ఇలా పంపగానే, చక్రాయుధం సరోవరంలోని లేలేత పద్మాలని కౌగలించుకోడానికి వెళ్తున్న సూర్యబింబంలా వెళ్ళింది. గుభిల్లు గుభిల్లనే పెద్ద చప్పుడుతో మడుగు కలచిపోయేలా లోపలికి దూకింది. రివ్వున మనో వేగంతో ఆ చెడ్డదైన మొసలి ఉన్న చోటు సమీపించింది.
8-112 శార్దూల విక్రీడితము
భీమంబై తలఁ ద్రుంచి ప్రాణములఁ బాపెం జక్ర మా శుక్రియన్
హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గామక్రోధన గేహమున్ గరటి రక్తస్రావ గాహంబు ని
స్సీమోత్సాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.
తాత్పర్యము
రివ్వున పోయి, చక్రాయధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం మేరు పర్వతమంత పెద్ద దేహం గలది, అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది, కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారల రుచిమరిగినది, అంతులేని ఉత్సాహంతో అలసటలేకుండ పోరాడుచున్నది, గెలుపుని నమ్మకంగా కోరుతున్నది. విష్ణుచక్రం వెళ్ళి అలాంటి మొసలి శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది.
8-113 వచనము
ఇట్లు నిమిష స్పర్శనంబున సుదర్శనంబు మకరితలఁ ద్రుంచు నవసరంబున.
తాత్పర్యము
ఇలా రెప్పపాటు కాలంలో మొసలి శిరస్సును సుదర్శన చక్రం ఖండించిన ఆ సమయంలో
8-114 కంద పద్యము
మకర మొకటి రవిఁ జొచ్చెను;
మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
మకరాలయమునఁ దిరిగెఁడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.
తాత్పర్యము
ద్వాదశరాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకి చేరాయి.
(మకరం అంటే మొసలి. ఇలా మొసళ్ళు అన్ని బెదిరిపోడానికి కారణం భూలోకంలో ఒక మడుగులో ఉన్న గజేంద్రుని హరించ సిద్ధపడ్డ మకరం ఖండింపబడటం. విష్ణుమూర్తి సుదర్శనచక్రం అంటే ఉన్న విశ్వవ్యాప్త భీతిని స్ఫురింపజేసినట్టి కవి చమత్కారం యిది. (1) ఆకాశంలో ఉన్న మకరం అంటే ఆకాశంలో (1.మేషము, 2.వృషభము, 3.మిథునము, 4.కర్కాటకము, 5.సింహము, 6.కన్య, 7.తుల, 8.వృశ్చికము, 9.ధనుస్సు, 1.0మకరము, 11.కుంభము, 12.మీనము అనబడే) ద్వాదశ రాసులు ఉన్నాయి కదా వాటిలోని మకరం, (2) పాతాళంలో ఉన్న మకరం అంటే కుబేరుని వద్ద (1.మహాపద్మము 2.పద్మము 3.శంఖము 4.మకరము 5.కచ్ఛపము 6.ముకుందము 7.కుందము 8.నీలము 9.వరము అనబడే) నవనిధులు ఉన్నాయి కదా వాటిలోని మకరం. (3) సముద్రంలోని మకరాలు అంటే మొసళ్ళకి అదే కదా నివాసం. ఆ మకరాలన్నీ. ఇంకా సముద్ర మథన సమయంలో ఆది కూర్మం సముద్రంలోనే కదా అవతరించింది.)
8-115 మత్తేభ విక్రీడితము
తమముం బాసిన రోహిణీవిభు క్రియన్ దర్పించి సంసారదుః
ఖము వీడ్కొన్న విరక్తచిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పా
దము లల్లార్చి కరేణుకావిభుఁడు సౌందర్యంబుతో నొప్పె సం
భ్రమదాశాకరిణీ కరోజ్ఝిత సుధాంభస్స్నాన విశ్రాంతుఁడై.
తాత్పర్యము
కారుచీకటి నుండి వెలువడిన చందమామ లాగ, సంసార బంధాల నుండి విడివడిన సన్యాసి లాగ, గజేంద్రుడు మొసలి పట్టు విడిపించుకొని ఉత్సాహంగా కాళ్ళు కదలించాడు. ఆదరంతో ఆడదిగ్గజాలు లాంటి ఆడ ఏనుగులు తొండాలతో పోసిన అమృత జలంలో స్నానం చేసి అలసట తీర్చుకొన్న వాడై గజేంద్రుడు గర్వించి చక్కదనాలతో చక్కగా ఉన్నాడు.
8-116 శార్దూల విక్రీడితము
పూరించెన్ హరి పాంచజన్యముఁ గృపాంభోరాశి సౌజన్యమున్
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్
సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్
దూరీభూత విపన్నదైన్యమును నిర్ధూతద్విషత్సైన్యమున్.
తాత్పర్యము
విష్ణుమూర్తి విజయసూచకంగా పాంచజన్య శంఖాన్ని ఊదాడు. ఆ శంఖం దయారసానికి సాగరం వంటిది. తన మహా గొప్పధ్వనితో పంచభూతాల మహా చైతన్యాన్ని పటాపంచలు చేసేది. అపారమైన శక్తితో కూడిన తెల్లని కాంతితో ఇంద్రాది ప్రభువులకైన బెరకు పుట్టించేది. దీనుల దుఃఖాన్ని పోగొట్టేది. శత్రువుల సైన్యాలను పారదోలేది.
8-117 మత్తేభ విక్రీడితము
మొరసెన్ నిర్జరదుందుభుల్; జలరుహామోదంబులై వాయువుల్
దిరిగెం; బువ్వులవానజల్లుఁ గురిసెన్; దేవాంగనాలాస్యముల్
పరఁగెన్; దిక్కులయందు జీవజయశబ్దధ్వానముల్ నిండె; సా
గర ముప్పొంగెఁ దరంగ చుంబిత నభోగంగాముఖాంభోజమై.
తాత్పర్యము
శ్రీహరి పాంచజన్యం ధ్వనించగానే దేవతల దుందుభులు మోగాయి. పద్మాల సువాసనలతో కూడిన గాలులు వీచాయి. పూలవానలు కురిసాయి. దేవతా స్త్రీలు నాట్యాలు చేసారు. సకల ప్రాణుల జయజయధ్వానాలు నల్దిక్కుల వ్యాపించాయి. తన తరంగాలతో సముద్రుడు ఉప్పొంగి ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఆనందించాడు.
8-118 కంద పద్యము
నిడుద యగు కేల గజమును
మడువున వెడలంగఁ దిగిచి మదజల రేఖల్
దుడుచుచు మెల్లన పుడుకుచు
నుడిపెన్ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా!
తాత్పర్యము
మహారాజా! విష్ణుమూర్తి తన పొడవైన చేతితో గజేంద్రుని సరస్సులోంచి బయటకు తీసుకొని వచ్చాడు. అతని మదజల ధారలు తుడిచాడు. మెల్లగా దువ్వుతు దుఃఖాన్ని పోగొట్టేడు.
8-119 కంద పద్యము
శ్రీహరి కర సంస్పర్శను
దేహము దాహంబు మాని ధృతిఁ గరిణీసం
దోహంబుఁ దాను గజపతి
మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్.
తాత్పర్యము
విష్ణుమూర్తి చేతి స్పర్శ వల్ల గజేంద్రుని శరీరతాపం అంతా పోయింది. గజరాజు సంతోషంగా ఆడఏనుగుల సమూహంతో కలిసి చేస్తున్న ఘీంకర నాదాలతో సొంపుగా ఉన్నాడు.
8-120 కంద పద్యము
కరమున మెల్లన నివురుచుఁ
గర మనురాగమున మెఱసి కలయం బడుచుం
గరి హరికతమున బ్రతికినఁ
గరపీడన మాచరించెఁ గరిణుల మరలన్.
తాత్పర్యము
శ్రీహరి దయవల్ల బతికినట్టి గజేంద్రుడు, ఇదివరకు లానే తన ఆడ ఏనుగులను తన తొండంతో మెల్లగా తాకాడు. మళ్ళీ మిక్కిలి ప్రేమగా వాటి తొండాలను తన తొండంతో నొక్కాడు.
8-121 సీస పద్యము
జననాథ! దేవలశాప విముక్తుఁడై;
పటుతర గ్రాహరూపంబు మాని
ఘనుఁడు హూహూ నామ గంధర్వుఁ డప్పుడు;
తన తొంటి నిర్మల తనువుఁ దాల్చి
హరికి నవ్యయునకు నతిభక్తితో మ్రొక్కి;
తవిలి కీర్తించి గీతములు పాడి
యా దేవు కృప నొంది యందంద మఱియును;
వినత శిరస్కుఁడై వేడ్కతోడ
ఆటవెలది
దళిత పాపుఁ డగుచు దనలోకమున కేగె
నపుడు శౌరి కేల నంటి తడవ
హస్తి లోకనాథుఁ డజ్ఞాన రహితుఁడై
విష్ణురూపుఁ డగుచు వెలుఁగుచుండె.
తాత్పర్యము
పరీక్షిన్మహారాజా! అప్పుడు దేవల ముని పెట్టిన శాపం నుండి విముక్తి కావడంతో “హూహూ” అనే పేరు గల ఆ గంధర్వుడు ఆ కఠినమైన మొసలి రూపం విడిచిపెట్టేడు. తన పూర్వపు నిర్మల మైన రూపం ధరించాడు. మిక్కిలి భక్తితో విష్ణుమూర్తికి మొక్కి స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాడు. భక్తిగా వంచిన శిరస్శుతో మరల మరల నమస్కరిస్తు సంతోషంగా పుణ్యాత్ముడై గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి గజరాజును చేతితో దువ్వాడు. వెంటనే గజరాజు అఙ్ఞాన మంతా తొలగిపోయింది. అతను విష్ణుదేవుని సారూప్యం పొంది ప్రకాశించాడు.
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319